నెలతప్పినట్లు బిడ్డ పుట్టేదాక తెలీదు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు బిడ్డకు జన్మనివ్వడం అందర్నీ ఆశ్చర్యం గొలుపుతోంది. అంతేకాదు, బిడ్డ పుట్టే వరకూ అసలు కనీసం తాను గర్భం దాల్చినట్లు కూడా వృద్ధురాలికి తెలియకపోవడం సంచలనం రేపుతోంది. స్నానాల గదిలోకి వెళ్లినప్పుడు ఆకస్మాత్తుగా ప్రసవమై శిశువు జన్మించింది. బిడ్డ బరువు కేవలం 800 గ్రాములే కావడం విశేషం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలో కోడె రాములమ్మ, రాముడు అనే దంపతులు ఉన్నారు. వీరికి 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. సంతానం తర్వాత, అంటే గత 22 ఏళ్ల క్రితం ఇక పిల్లలు వద్దనుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కూడా చేయించుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటూ, కూలీ పనికి వెళ్తూ జీవనం సాగించారు. ఇలాగే ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి, వారిద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. వీరికి పెళ్లి చేసి దాదాపు మూడేళ్లు అయింది. ఈ మధ్య కొన్ని నెలలుగా రాములమ్మకు నెలసరి రాకపోతుండడం గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడే చికిత్స పొందింది.
ఈ క్రమంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే రాములమ్మ శుక్రవారం కూలీ పనులు చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ సాయంత్రం ఆమెకు కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆశా వర్కర్‌ దగ్గరకు వెళ్లింది. ఆమె ఇచ్చిన టాబ్లెట్‌ను వేసుకుంది. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో చేసేది లేక కాసేపటికి ఇంటికి చేరుకొని బాత్‌ రూంకి వెళ్లింది. లోపలే ఆడ శిశువు ప్రసవించింది. కనీసం గర్భం దాల్చినట్లు ఆమె గానీ, కుటుంబ సభ్యులు గానీ గుర్తించలేకపోవడం గమనార్హం.